Hot Posts

6/recent/ticker-posts

ఒంగోలు సీన్ రిపీట్.. అధిపత్య పోరులో టీడీపీ నేతల దారుణ హత్య


ANDRAPRADESH, NELURU: టూవీలర్ మీద వస్తున్న ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని స్కార్పియోతో గుద్దేసి.. దారుణంగా హత్య చేసిన వైనం సంచలనంగా మారింది. By:  PASCHIMA VAHINI  ఏపీలో ఏం జరుగుతోంది? సాధారణంగా అధికారంలో ఉన్న వారు విపక్ష నేతల్ని టార్గెట్ చేయటం.. వారిని అంతమొందించటం లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఏపీలో అందుకు భిన్నంగా సొంత పార్టీ నేతల్ని దారుణంగా చంపుకోవటం ఒక ఇష్యూగా మారింది. అది కూడా అధికారంలో ఉన్న వేళ.. తమకు అడ్డుగా ఉన్నారన్న నెపంతో సొంత పార్టీ నేతల్ని దారుణంగా హత్య చేస్తున్న వైనం పార్టీలోనూ కలవరపాటుకు గురి చేస్తోంది. పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న తాజా హత్యల్ని చూసినప్పుడు.. కొద్ది నెలల క్రితం ఒంగోలులో టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య ఉదంతం గుర్తుకు రావటం ఖాయం. 


వీరయ్య చౌదరిని హత్య చేసింది సొంత పార్టీ నేతలే. తాజా హత్యలు సైతం అధికార టీడీపీకి చెందిన వారే కావటం సంచలనంగా మారింది. సొంత పార్టీ నేతల్ని చంపుకోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి వస్తున్న సమాధానం అధిపత్య పోరుగా చెబుతున్నారు. గతంలో అధికారపార్టీకి చెందిన నేతల మధ్య వర్గ పోరు ఉంటే.. అధినేత వద్ద విషయాల్ని తేల్చుకునే వారే కానీ.. అడ్డదిడ్డంగా హత్యలు చేసుకోవటం చాలా అరుదుగా జరిగేది. అందుకు భిన్నంగా టీడీపీలో మాత్రం ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకోవటం గమనార్హం. 

కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారిన నేతలు.. తెలుగుదేశం పార్టీ నేతలతో ఉన్న అధిపత్య పోరులో భాగంగా దారుణంగా హత్య చేసిన వైనం పల్నాడులోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో చోటు చేసుకుంది. హత్యకు గురైన ఇద్దరు సొంత అన్నదమ్ములే కావటం గమనార్హం. అన్న జెవిశెట్టి వెంకటేశ్వర్లు(60), తమ్ముడు కోటేశ్వరరావు (56) టీడీపీలో కీలక నేతలుగా పేరుంది. తమ గ్రామానికి చెందిన పార్టీ నేత చంద్రయ్యను వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన వారు దారుణంగా హత్య చేసిన వైనం తెలిసిందే. 

చంద్రయ్య మరణం తర్వాత పార్టీకి కీలకంగా మారారు ఈ ఇద్దరు అన్నదమ్ములు. అయితే.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెంకట్రామయ్య వర్గం టీడీపీలో చేరింది. అప్పటి నుంచి ఊళ్లో రాజకీయ అధిపత్యం కోసం ఇరు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఇందులో వెంకటేశ్వర్లు.. కోటేశ్వరరావులకు ఊళ్లో పట్టు ఉండటం.. ఎంత ప్రయత్నం చేసినా ఊళ్లో పార్టీ లో పట్టు విషయంలో వెంకటరామయ్య వెనుకబడి ఉన్నారు. దీంతో.. ఈ ఇద్దరు అన్నదమ్ములు బతికి ఉన్నంత వరకు తనకు పట్టురాదన్న ఉద్దేశంతో వారిని తాజాగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. 

టూవీలర్ మీద వస్తున్న ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని స్కార్పియోతో గుద్దేసి.. దారుణంగా హత్య చేసిన వైనం సంచలనంగా మారింది. ఈ హత్యకు రెండు రోజులక్రితం చోటు చేసుకున్న పరిణామం కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పల్లెనిద్రలో భాగంగా ఊరికి వచ్చారు. తిరిగి వెళుతూ.. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తన పెద్ద మనిసిగా జెవిశెట్టి వెంకటేశ్వర్లుగా పేర్కొంటూ.. ఆయన్ను కలవాలని చెప్పారు. 

ఎస్పీ ప్రకటన వెంకట్రామయ్యకు కంటకింపుగా మారింది. దీనికి తోడు అతడి వర్గానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి రెండు కాళ్లను కొందరు వ్యక్తులు దాడి చేసి విరగ్గొట్టారు. ఈ దాడికి పాల్పడిన వారికి వెంకటేశ్వర్లు అండగా నిలవటం వెంకట్రామయ్యకునచ్చలేదు. దీంతో.. ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని చంపేయాలని ప్లాన్ చేసి పక్కా స్కెచ్ వేశారు. షాకింగ్ అంశం ఏమంటే.. వెంకటేశ్వర్లు.. అతడి సోదరుడ్ని హత్య చేసేందుకు వారిద్దరి పెదనాన్న కొడుకు జెవిశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వెంకట్రామయ్య ప్లాన్ చేశారు. వెంకటేశ్వర్లు.. కోటేశ్వరరావుతోపాటు వారి బంధువు మొత్తంగా రెండు డజన్ల మంది తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఒక ఫంక్షన్ కు వెళ్లారు. 

వేడుక పూర్తి చేసుకొని ఊరికి తిరిగి వచ్చేందుకు టూవీలర్ మీద బయలుదేరారు. మిగిలిన వారంతా మాచర్లలో ఆగి టీ తాగుతున్న సమయంలో అన్నదమ్ములు ఇద్దరు ఊరికి బయలుదేరారు. వీరిని హత్య చేసేందుకు సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్న వెంకట్రామయ్య.. కారుతో ఇద్దరిని గుద్దించి.. స్పాట్ లో చనిపోయేలా చేశారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది అధికార పార్టీకి చెందిన నేతల్ని.. అదే పార్టీకి చెందిన వారు హత్య చేస్తున్న వైనాన్ని అధినాయకత్వం సీరియస్ గా తీసుకోవాలని చెబుతున్నారు.