Hot Posts

6/recent/ticker-posts

యశస్వి జైశ్వాల్ జోరు.. అయినా తక్కువే రాజస్థాన్ స్కోరు!


ఐపీఎల్ 2025లో తమ హోంగ్రౌండ్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 173/4 పరుగులకు పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వికెట్లు చేతిలో ఉన్నా.. రాజస్థాన్ బ్యాటర్లు భారీ షాట్‌లు కొట్టలేకపోయారు. ఆది నుంచి నిదానంగానే ఆడారు. చివర్లోనూ ఆశించిన మేర రాణించలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నమోదు అయింది. అయితే ఓ పక్క యశస్వి జైశ్వాల్.. ధాటిగా ఆడుతున్నా కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం తడబడ్డాడు. బంతిని బ్యాట్‌కు కనెక్ట్ చేయలేకపోయాడు. 19 బంతులు ఎదుర్కొన్నా.. కనీసం 100 స్ట్రైక్ రేట్‌ కూడా మెయింటేన్ చేయలేకపోయాడు. 15 పరుగులు చేసి.. స్టంపౌట్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (22 బంతుల్లో 30 రన్స్), ధ్రువ్ జురెల్ (23 బంతుల్లో 35 రన్స్ నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. ఓవైపు వికెట్లు పడుతున్నా జైశ్వాల్ మాత్రం రాణించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి.. 47 బంతుల్లో 75 రన్స్ స్కోరు చేసి ఔట్ అయ్యాడు. హిట్‌మెయర్ (8 బంతుల్లో 9 రన్స్‌) విఫలమయ్యాడు. చివరి బంతికి నితీశ్ రాణా ఫోర్‌ కొట్టడంతో రాజస్థాన్ స్కోరు 170 పరుగుల మార్కును దాటింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు.. 173/4 పరుగులు చేసింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, జోష్ హేజిల్‌వుడ్, కృనాల్‌ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు. వాస్తవానికి రాజస్థాన్ రాయల్స్ ఇంకా తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేది. కానీ క్యాచ్‌లు మిస్ చేయడంతో పాటు బౌండరీలను ఆపడంలోనూ ఆర్సీబీ ఫీల్డర్లు విఫలమయ్యారు. ఈ టోర్నీలో ఆర్సీబీ నాలుగో విజయం సాధించాలంటే.. 174 రన్స్ చేయాల్సిందే.