ANDRAPRADESH: ఏడాదిగా అందరి కళ్లూ రాజధాని అమరావతిపైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును ఎప్పటిలా పూర్తిచేస్తారనేదానిపై ఎక్కువగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా, రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, గత ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలు చేసేందుకు ప్రయత్నించిందనే విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభమయ్యాయి.
ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నగర నిర్మాణం పూర్తి చేయాలని పట్టుదల ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అమరావతిని అన్ని రంగాల్లో అగ్రపథాన నిలపాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తాను వెళ్లిన ప్రతి చోట అమరావతిపై మాట్లాడుతున్నారు. రెండు రోజుల క్రితం సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అక్కడ కూడా రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజధాని విశిష్టతను వివరిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అమరావతి రాష్ట్రానికి భారం అవుతుందని కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న ప్రచారాన్ని కొట్టివేస్తూ చంద్రబాబు రాజధాని నిర్మాణంపై పెట్టుబడిదారుల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేశారని అంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే అమరావతి నిర్మాణంపై ఫోకస్ చేశారు. 2015లో రైతుల నుంచి 34 వేల ఎకరాలను సేకరించి నవ నగరాలు నిర్మాణానికి ప్లాన్ చేశారు. అయితే దురదుష్టం కొద్ది 2019లో ఓడిపోవడంతో రాజధాని నిర్మాణం పూర్తి చేయలేకపోయానని చంద్రబాబు చెబుతుంటారు. అయితే దేవుడు తనకు ఇచ్చిన మరో అవకాశంతో ఈ విడతలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తానని చెబుతున్నారు. రాజకీయాల్లో ఎవరికి రాని అవకాశం తనకు వచ్చిందని, తన హయాంలో రెండు నగరాలను నిర్మించే సదావకాశం లభించిందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి ఆనుకుని సైబరాబాద్ నిర్మించిన చంద్రబాబు ఇప్పుడు హైదరాబాద్ ను మించేలా అమరావతి నిర్మాణానికి అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా, అమరావతిపై ఆయన వెనక్కి తగ్గడం లేదు. దీంతో రాజధాని ఏపీకి బంగారు అవకాశంగా చాటుతున్న చంద్రబాబు పెట్టుబడిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇస్తున్నారు. మరి చంద్రబాబు ప్రయత్నాలు.. హామీలను పెట్టుబడిదారులు ఎంతవరకు విశ్వసిస్తారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.