ఇందులో 94 మంది టీ డీపీ అభ్యర్థులు ఉండగా ఐదుగురు జనసేన అభ్యర్థులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ, జనసేన కూటమి కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా తొలి జాబితాలోనే 99 స్థానాలకు అభ్యర్థులను కూటమి ప్రకటించింది. ఇందులో 94 మంది టీ డీ పీ అభ్యర్థులు ఉండగా ఐదుగురు జనసేన అభ్యర్థులు ఉన్నారు.
కాగా టీడీపీ ఈసారి తన తొలి జాబితాలోనే ఏకంగా 24 మంది కొత్తవారికి సీట్లు ప్రకటించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేసినవారికి శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చారు.
గతంలో కురబ కార్పొరేషన్ ఛైర్మన్గా పనిచేసిన సవిత.. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేస్తున్న ఎరిక్షన్ బాబు గతంలో సర్పంచి, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో లిడ్ క్యాప్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా ఎరిక్షన్ బాబు పనిచేశారు. ఆయన ఇప్పుడు అసెంబ్లీకి తొలిసారి పోటీ చేయబోతున్నారు.
ఇక వేగేశ్న నరేంద్రవర్మ.. బాపట్ల నుంచి అవకాశం దక్కించుకున్నారు. ఆయన కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగారు. అదేవిధంగా కర్నూలు మండలం పసుముల గ్రామ సర్పంచి శీలమ్మ కుమారుడైన న్యాయవాది బొగ్గుల దస్తగిరికి.. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం టికెట్ ను ఇచ్చారు. రాజమండ్రి సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకు తొలిసారి అవకాశం కల్పించారు. రాజమండ్రి సిటీ నుంచే ఆయన పోటీ చేయనున్నారు.
అలాగే ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన కురుపాం నుంచి తోయక జగదీశ్వరికి సీటు కేటాయించారు. గతంలో ఆమె తాత అడ్డాకుల లక్ష్మణనాయుడు రెండుసార్లు కురుపాం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదేవిధంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్న ప్రముఖ యూట్యూబర్ రాజేశ్ మహాసేనకు పి.గన్నవరం సీటును కేటాయించారు. అమరావతి ఉద్యమనేత కొలికిపూడి శ్రీనివాసరావుకు తిరువూరు అసెంబ్లీ సీటును ఇచ్చారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యకు తుని సీటును కేటాయించారు.
టీడీపీ తరఫున తొలిసారి సీటు దక్కించుకున్నవారు వీరే..
1.తోయక జగదీశ్వరి (కురుపాం) 2.విజయ్ బోనెల (పార్వతీపురం) 3.కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం) 4.యనమల దివ్య (తుని) 5.మహాసేన రాజేశ్ (పి.గన్నవరం) 6.ఆదిరెడ్డి వాసు (రాజహేంద్రవరం సిటీ) 7.బడేటి రాధాకృష్ణ (ఏలూరు) 8.సొంగ రోషన్ (చింతలపూడి) 9.కొలికపూడి శ్రీనివాస్ (తిరువూరు) 10.వెనిగండ్ల రాము (గుడివాడ) 11.వర్ల కుమార్ రాజా (పామర్రు) 12.వేగేశ్న నరేంద్రవర్మ (బాపట్ల) 13.గూడూరి ఎరిక్షన్బాబు (యర్రగొండపాలెం) 14.కావ్యా కృష్ణారెడ్డి (కావలి) 15.నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట) 16.కాకర్ల సురేష్ (ఉదయగిరి) 17.మాధవీరెడ్డి (కడప) 18.బొగ్గుల దస్తగిరి (కోడుమూరు) 19.అమిలినేని సురేంద్రబాబు (కల్యాణదుర్గం) 20.ఎం.ఈ.సునీల్కుమార్ (మడకశిర) 21.సవిత (పెనుకొండ) 22.జయచంద్రరెడ్డి (తంబళ్లపల్లి) 23.వి.ఎం.థామస్ (జీడీ నెల్లూరు) 24. గురజాల జగన్మోహన్ (చిత్తూరు)