తాజా వార్తలు

10/recent/ticker-posts

జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన నేపాల్ ప్రతినిధి బృందం


ఏలూరు, మార్చి , 28 : ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విధానాలను అధ్యయణం చేయడానికి నేపాల్ దేశానికీ చెందిన 8 మంది ప్రతినిధుల బృందం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో శనివారం పర్యటించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు రామగోపాల్ తోటను సందర్శించి, నిమ్మ మరియు కొబ్బరి పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎలా సాగు చేస్తున్నారో పరిశీలించారు. రుచికరమైన, పోషకవంతమైన ఆహారం మరియు నేల ఆరోగ్యం మెరుగుపడటానికి ప్రకృతి వ్యవసాయానికి మారిన తన అనుభవాలను రైతు వివరించారు. అలాగే పాకలపాటి శరత్ కోకో మరియు కొబ్బరి తోటల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అమలు గురించి వివరించి, తోటల పంటల్లో వీటి ప్రయోజనాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి. వెంకటేష్ సమన్వయం చేసి, వ్యవసాయ శాఖ మరియు రైతు సాధికార సంస్థ (RySS) కలిసి ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నాయో వివరించారు. ఐసీఆర్పీలు, యూనిట్ ఇన్చార్జ్లు, ఎఫ్ఎమ్టీల పాత్రతో రైతులను రసాయన వ్యవసాయం నుండి ప్రకృతి వ్యవసాయానికి మార్చే విధానంపై చర్చించారు.

తదుపరి బృందం వెంకటకృష్ణాపురం గ్రామంలో కె. నవీన్ కుమార్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ డ్రాగన్ ఫ్రూట్, అరెకనట్, ఆయిల్ పామ్, కూరగాయలు వంటి పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ప్రస్తుత కాలంలో మార్కెట్లో లభిస్తున్న పంటల్లో నాణ్యత తగ్గిపోవడంతో ప్రజలు రసాయనాలను ఎక్కువగా తీసుకుంటున్నారని, అయితే సహజ పద్ధతుల్లో పండించిన పంటలను ఒకసారి రుచి చూసిన తర్వాత వినియోగదారులు నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారని రైతు తెలిపారు.

తదుపరి గుండుగోలాను కుంటలోని శ్రీ ఒబిలిసెట్టి గోపాలకృష్ణ గారి బయో రిసోర్స్ సెంటర్ను సందర్శించి, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, అగ్నాస్త్రం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాల తయారీ మరియు వినియోగ విధానాలను తెలుసుకున్నారు. అలాగే “ఎనీ టైమ్ మనీ (ATM)” మోడల్ను పరిశీలించి, వివిధ రకాల కూరగాయల సాగుతో రోజువారీ ఆదాయం ఎలా పొందవచ్చో అవగాహన పొందారు. అదనంగా, మెంటర్ ఇంటర్న్ జంగ గణేష్ పొలంలో అరెకనట్, కోకో, కొబ్బరి, పసుపు, ఆయిల్ పామ్ మరియు కూరగాయలతో కూడిన 5-లేయర్ మోడల్ను ప్రదర్శించారు. ఈ సందర్శనలో ప్రతినిధులు అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి సహజ ఇన్పుట్ల వినియోగాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, వాటి ప్రాముఖ్యతను అభినందించారు. నేల నాణ్యతను స్వయంగా చేతులతో పరిశీలించి ప్రకృతి వ్యవసాయం ప్రభావాన్ని గుర్తించారు.

రసాయన రహితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న రైతుల కృషిని ప్రతినిధి బృందం ప్రశంసిస్తూ, రైతుల ఆదాయం, నేల ఆరోగ్యం మరియు ప్రజల శ్రేయస్సు పెంపుకు ప్రకృతి వ్యవసాయం ఉత్తమ మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రకృతి వ్యవసాయం విధివిధానాలు అంత చాలా కొత్తగా ఉంది అని బృందం తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డిపిఎం బి. వెంకటేష్, ఏడిఏ ఉషా రాజకుమారి, ఏఓ చెన్నకేశవులు, హెచ్ఓ అమర్నాథ్, హుమాయున్, వి. కృష్ణారావు, నాగ ప్రమీల రాణి, దాదాపీర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.