Hot Posts

6/recent/ticker-posts

తిరువూరులో టెన్షన్.. టెన్షన్.. వైసీపీ స్వయంకృతం


ANDRAPRADESH, KRISHNA, ELURU, THIRUVURU: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. BY: PASCHIMA VAHINI 2021లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో అప్పటి అధికార వైసీపీ తిరువూరులో పూర్తి ఆధిక్యం సాధించింది. By:  20 వార్డులకు 17 కైవసం చేసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని తన ఖాతాలో వేసుకుంది వైసీపీ. అయితే ఇప్పుడు పార్టీ స్వయంకృత తప్పిదాలతో చైర్మన్ పదవిని, మున్సిపాలిటీని చేజేతులా వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీలో గ్రూపు తగదాలు, కౌన్సిలర్ల తిరుగుబాటుతో నాలుగేళ్ల క్రితం చైర్‌పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన గత్తం కస్తూరిబాయి గత నెలలో రాజీనామా చేశారు. ఆ స్థానానికి సోమవారం జరిగే ఉప ఎన్నికలో తిరిగి వైసీపీ విజయం సాధించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే చాలా మున్సిపాలిటీల్లో అధికార మార్పిడి జరిగిన విషయం తెలిసిందే. మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ తన అభ్యర్థులను గెలిపించుకుంటోంది. వాస్తవానికి టీడీపీకి బలం లేకపోయినా, ఆపరేషన్ ఆకర్ష్ తో వైసీపీ నుంచి గెలిచిన వారిని కూటమి పార్టీల్లో చేర్చుకుని ఆయా మున్సిపల్, కార్పొరేషన్లలో పాగా వేస్తోంది కూటమి. కానీ, తిరువూరు నగర పంచాయతీలో టీడీపీ పెద్దగా ప్రయత్నించకపోయినా, వైసీపీ తన స్థానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితిని తెచ్చుకుందని అంటున్నారు. 

తిరువూరు నగర పంచాయతీలో 17 కౌన్సిల్ స్థానాలను గెలుచుకున్న వైసీపీ గత్తం కస్తూరిబాయిని చైర్‌పర్సనుగా ఎంపిక చేసింది. అయితే అప్పట్లో మిగిలిన కౌన్సిలర్లు అడగకపోయినా, చైర్మన్ పదవీకాలాన్ని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని అప్పటి ఎమ్మెల్యే రక్షణనిధి కండీషన్ పెట్టారు. దీంతో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే కౌన్సిలర్ల మధ్య చైర్మన్ పదవిపై పంచాయతీ మొదలైంది. ఈ వివాదం చినికిచినికి గాలివానలా మారి కౌనిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయే పరిస్థితికి తీసుకువచ్చింది. ఇదే సమయంలో కూటమి అధికారంలోకి వచ్చాక రాజకీయం మరింతగా ముదిరింది. వాస్తవానికి స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యేకు మిగిలిన క్యాడర్ కు అంతగా పోసగకపోయినా, వైసీపీ విభేదాలతో తిరువూరు మున్సిపాలిటీపై టీడీపీ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. 

ఎమ్మెల్యే కొలికపూడికి టీడీపీ క్యాడరుకు తొలి నుంచి విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మున్సిపాలిటీని గెలుచుకునే అవకాశం రావడంతో ఎమ్మెల్యేతోపాటు మిగిలిన నేతలు చేతులు కలిపారని అంటున్నారు. వైసీపీ అంతర్గత విభేదాలతో తమలోనే ఒకరిని చైర్‌పర్సనుగా ఎన్నుకోవాలని తొలుత భావించినా, టీడీపీ రంగ ప్రవేశంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. గత నెలలో తన పదవికి రాజీనామా చేసిన కస్తూరిబాయి.. మళ్లీ పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఆమెకు టీడీపీ మద్దతు ప్రకటిస్తుందా? అన్నది ఇంట్రస్టింగుగా మారింది. 

మొత్తం 20 మంది కౌన్సిలర్లు, ఎక్స్-అఫీషియో ఓటరుగా ఎమ్మెల్యే కొలికపూడి సోమవారం జరిగే ఎన్నికకు హాజరుకావాల్సివుంది. అయితే కౌన్సిలర్లలో ఒకరు విదేశాల్లో ఉన్నారని అంటున్నారు. మరోవైపు రెండు విడతలుగా కౌన్సిలర్లను క్యాంపు రాజకీయానికి తరలించిన వైసీపీకి కొందరు కౌన్సిలర్లు హ్యాండిచ్చే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. దీంతో తిరువూరులో ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం టీడీపీకి ఎమ్మెల్యే కొలికపూడి ఓటుతో కలిపి అధికారికంగా నాలుగు ఓట్లు ఉన్నాయి. వైసీపీలో చీలకవర్గం వీరితో చేతులు కలుపుతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో మున్సిపల్ చైర్‌పర్సన్ ఉప ఎన్నికల్లో ఏ గ్రూపును విజయం వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.