ANDRAPRADESH, AMARAVATHI; ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి సిద్ధం అవుతున్న వేళ.. BY: PASCHIMA VAHINI ప్రభుత్వం చర్చలు జరుపుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, నూతన విద్యా విధానం, ప్రభుత్వ విధానాలపై ఉన్న అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన పలు డిమాండ్ లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మూడు అంశాలలో మాత్రం సస్పెన్స్ నడుస్తుందని సమాచారం.
15 ప్రధాన డిమాండ్లు..
ఉపాధ్యాయ సంఘాలు ఈ సమావేశంలో మొత్తం 15 డిమాండ్లను ప్రభుత్వానికి సమర్పించాయి. వాటిలో ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత, పదోన్నతులు, పీఆర్సీ అమలు, స్కూల్ అసిస్టెంట్ పదవులకు ప్రమోషన్లు, రేషనలైజేషన్పై స్పష్టత సహా.. పాత పాఠశాల నిర్మాణ పద్ధతుల పునరుద్ధరణ, 9 రకాలుగా స్కూళ్ల విభజనపై పునర్విచారణ, ఇంగ్లీష్ మీడియం పై మౌలిక సదుపాయాలు కల్పించకుండానే అమలు వంటి అంశాలు ఉన్నట్టు చెబుతున్నారు.
అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన డిమాండ్లలోని కొన్ని అంశాలకు.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ, మూడు ప్రధాన అంశాలపై మాత్రం చర్చలు ఇంకా సాగుతున్నాయని అంటున్నారు. ఈ మూడు డిమాండ్లే చర్చల్లో అడ్డంకిగా నిలుస్తున్నాయని భావిస్తున్నారు. వాటిలో..
ఫౌండేషన్ స్కూళ్ల రద్దు..
గ్రామీణ, చిన్న పాఠశాలలను విలీనం చేయడం వల్ల విద్యా ప్రమాణాలు తగ్గుతాయని, ఈ విధానం విద్యార్థులకు చేటు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం. ఫౌండేషన్ స్కూళ్లను పూర్తిగా రద్దు చేయాలని వారు కోరుతున్నారు.
బదిలీల మార్గదర్శకాల్లో సవరణలు..
ప్రస్తుతం అమలులో ఉన్న బదిలీల విధానాన్ని అన్యాయంగా భావిస్తూ, ఉద్యోగ భద్రతతో పాటు, కుటుంబ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకునే విధంగా మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంగ్లీష్ మీడియం అమలు..
మౌలిక సదుపాయాలు, ట్రెయిన్ అయిన టీచర్లు లేని పరిస్థితిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెట్టడం ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం. స్థానిక భాషల్లో విద్యా హక్కు భంగం అవుతోందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మూడు అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున.. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక మంత్రి నారా లోకేష్ తో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. మంత్రితో భేటీ తర్వాత ఉపాధ్యాయ సంఘాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో అని సస్పెన్స్ నెలకొంది.