Hot Posts

6/recent/ticker-posts

పులివెందుల‌లో పొలిటిక‌ల్ ఫైట్‌.. ఏం జ‌రిగింది?


ANDRAPRADESH, KADAPA, PULIVENDALA: వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో రాజ‌కీయ వివాదాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నాయ‌కులు, వైసీపీ నేత‌లు రోడ్డున ప‌డి త‌న్నుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు ప‌క్షాల‌ను శాంతింప చేశారు. అయితే.. వివాదాలు స‌ర్దుమ‌ణిగే అవ‌కాశం లేక‌పోవ‌డం ప్ర‌స్తుతం పికెట్ ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం టీడీపీ మ‌హానాడు క‌డ‌ప‌లోనే జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి మ‌హానాడు జ‌రుగుతున్న ప్రాంతానికి మ‌ధ్య చాలా దూర‌మే ఉంది.

కానీ, మ‌హానాడు ఊపులో ఉన్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. జిల్లా వ్యాప్తంగా ప‌సుపు వ‌ర్ణ శోభితం చేసేందుకు ప్ర‌య‌త్నిం చారు. దాదాపు ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ జెండాల‌ను అలంక‌రించారు. ఈ క్ర‌మంలోనే పులివెందుల‌లోనూ టీడీపీ జెండాలు క‌ట్టారు. దీనిని వైసీపీ నాయ‌కులు అడ్డుకున్నారు. టీడీపీ నేత‌లు,కార్య‌క‌ర్త‌లు.. జెండాలు అలా క‌ట్టి ఇలా వెళ్ల‌గానే.. స‌ద‌రు జెండాల‌ను తీసి.. చెత్త‌కుప్ప‌లో వేశారు. విష‌యం తెలుసుకున్న టీడీపీ నాయ‌కులు మ‌రోసారి వ‌చ్చి పులివెందుల‌లోని వైసీపీ కార్యాల‌యం ఎదురుగానే జెండాలు క‌ట్టేందుకు ప్ర‌య‌త్నించారు.

ఈ ప‌రిణామం మ‌రింత వివాదానికి దారితీసింది. మా కార్యాల‌యం ముందే మీరు జెండా క‌డ‌తారా? అంటూ.. వైసీపీ నాయ‌కులు ఎదురు తిరిగారు. ఈ ప‌రిణామాల‌తో ఇరు ప‌క్షాల మ‌ధ్య దూష‌ణ‌లు.. విమ‌ర్శ‌ల‌తోపాటు.. కొంద‌రు నాయ‌కులు బాహాబాహీకి దిగారు. ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో పోలీసులు రంగంలోకి దిగి ఇరు ప‌క్షాల‌ను శాంతింప చేసి.. పార్టీ కార్యాల‌యం స‌హా.. ప‌రిస‌ర ప్రాంతాల‌ను త‌మ అధీనంలోకి తీసుకున్నారు. మ‌ళ్లీ వ‌చ్చి టీడీపీ జెండాలు క‌డ‌తామంటూ.. ఆ పార్టీ నాయ‌కులు హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంతో వైసీపీ నాయ‌కులు కూడా దీటుగా స‌మాధానం ఇచ్చారు. ఈ ప‌రిణామాలో పులివెందుల‌లో పోలీసులు అలెర్ట‌య్యారు. కాగా.. గురువారం కూడా మ‌హానాడు జ‌ర‌గ‌నుంది.