INDIA NEWS: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటువంటి సమయంలోనే మరో ఘటన వెలుగులోకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. భారత జవాన్ పాకిస్థాన్ టెర్రరిస్టులకు అనుకూలంగా మారడం సంచలనంగా మారింది. సీఆర్పీఎఫ్ జవాన్ మోతీ రామ్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్లోని బైసరన్ లోయలో అమాయకులైన 26 మంది పర్యాటకుల హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ దాడికి ముందు పహల్గామ్లోనే డ్యూటీ చేసిన సీఆర్పీఎఫ్ జవాన్ మోతీ రామ్, దాడికి కేవలం ఆరు రోజుల ముందే అక్కడి నుంచి బదిలీ అవ్వడం అనుమానాలకు దారితీస్తోంది. అతని సోషల్ మీడియాపై నిఘా పెట్టిన సీఆర్పీఎఫ్, మోతీ రామ్ టెర్రరిస్టులకు సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు.మన సైనిక దళాల సీక్రెట్ ఆపరేషన్లు, భద్రతా మోహరింపులు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని అతడు పాక్కు చేరవేసినట్లు తేలింది. దీనిపై ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.
మోతీ రామ్ను పాకిస్థాన్ హనీ ట్రాప్లో ఇరికించిందా, లేదా బ్లాక్మెయిల్ చేసి సమాచారాన్ని రాబట్టిందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా, మే 7న అర్ధరాత్రి భారతదేశం "ఆపరేషన్ సిందూర్" పేరిట పాకిస్థాన్ను చావు దెబ్బ తీసింది. ఈ ఘటనలో పాకిస్థాన్తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 500 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు.ఈ ఘటనలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబానికి చెందిన పలువురు మృత్యువాత పడ్డారు.