Hot Posts

6/recent/ticker-posts

ఆర్కే బీచ్ టూ భీమిలి బీచ్.. ఆ ఈవెంట్ కోసం 5 లక్షల మందితో భారీ ప్లాన్


ANDRAPRADESH, VISAKHAPTNAM: ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఈసారి ఘనంగా నిర్వహించనున్నారు. విశాఖపట్నం వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సాధారణ పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, యోగా సంఘాల సభ్యులు, నేవీ, కోస్టల్ గార్డు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నారు.


ఈ మేరకు నేడు మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు యోగా దినోత్సవం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు.. 5 లక్షల మందితో భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆరోగ్య కరమైన జీవనానికి యోగా చాలా మంచిదని.. ఎప్పుడైనా అలసట వస్తే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే గొప్ప రిలీఫ్ వస్తుందని అన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి యోగాను పరిచయం చేశారని కొనియాడారు. రాబోయే మహానాడుకు అందరు యోగా చేయాలని.. యోగా నేర్చుకొని జూన్ 21న విశాఖ రావాలని సూచించారు.

రాష్ట్రంలో ఒకే రోజు 2 కోట్ల మంది యోగా చేయాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో కూడా ఒక గంట యోగా ప్రాక్టీస్ చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. యోగాలో ట్రైనర్లు, మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేస్తున్నామన్నారు. జూన్ 21న జరిగే యోగా ప్రపంచమంతా ఆశ్చర్య పోయేలా జరగాలని ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ వేడుకల కోసం RK బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి భీమిలి వరకు యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధన లక్ష్యంగా, మొత్తం మార్గంలో 127 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో వెయ్యిమంది చొప్పున పాల్గొంటారని.. ప్రతి 200×14 మీటర్లకు ఒక కంపార్ట్‌మెంట్ ఉంటుందని, ప్రతి కంపార్ట్‌మెంట్‌కు ఒక ఇన్‌చార్జ్, వైద్య సిబ్బంది, 10 వాలంటీర్లు ఉంటారని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా ఎల్ఈడీ స్క్రీన్లు, చిన్న స్టేజీలు, సౌండ్ సిస్టమ్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నామని వివరించారు.