INDIA NEWS: 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాల్లో "యువగళం" సరికొత్త చరిత్రకు నాంది పలికిన సంగతి తెలిసిందే. BY: PASCHIM VAHINI 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన టీడీపీ 2024 ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించడంలో "యువగళం" పాత్ర అత్యంత కీలకం. ఈ సమయంలో ఆ "యువగళం" కాపీ టేబుల్ బుక్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. తొలి కాపీని అందుకున్నారు.
ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్జీటీ శాఖల మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి శనివారం రాత్రి న్యూఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా రాత్రి 7:20 గంటల నుంచి రాత్రి 9:30 వరకూ ప్రధాని అధికారిక నివాసం 7-లోక కల్యాణ్ మార్గ్ లో ప్రధాని నరేంద్ర మోడీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
ఈ సమయంలో ప్రధానమంత్రి.. "యువగళం" కాపీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశంలో లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన, మరపురాని భేటీగా నిలిచిపోతుందనే చెప్పాలి. ఈ సమయంలో దేవాన్ష్ ను ప్రధాని మోడీ ముద్దు చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. చారిత్రాత్మకమైన ఈ పాదయాత్రం 3,132 కిలోమీటర్లు సాగింది. దీనికి సంబంధించిన విశేషాలను ఈ టేబుల్ బుక్ లో పొందుపరిచారు. ఈ సందర్భంగా.. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని.. దానిపై సంతకం చేసి లోకేష్ కు అందించారు.
ఇది కచ్చితంగా లోకేష్ కు మరపురాని జ్ఞాపకం అనే చెప్పాలి. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇప్పటికే అందిస్తోన్న నిరంతర మద్దతుకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వికసిత్ భారత్ - 2047 లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తనవంతు చేయూతనందించడానికి అవసరమైన మార్గదర్శనం చేయాలని ప్రధానిని మంత్రి లోకేష్ కోరారు. ఈ సమావేశం అనంతరం లోకేష్ కార్యాలయం ఈ విషయాలను ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా... అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రధాని మోడీ తొలిసారిగా ఈ ఏడాది జనవరి 8న అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్.టీ.పీ.సీ. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఇదే క్రమంలో... ఈ నెల 2న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికీ హాజరయ్యారు.
ఈ రెండు సందర్భాల్లోనూ తనకు స్వాగతం పలికిన లోకేష్ ను.. ఢిల్లీ వచ్చినప్పుడు తనను ఎందుకు కలవలేదని మోడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ప్రధాని అపాయింట్మెంట్ తీసుకున్న లోకేష్.. కుటుంబసభ్యులతో కలిసి శనివారం సాయంత్రం ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.