అంబేద్కర్ కోనసీమ జిల్లా: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అన్ని రంగాల్లో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా వరకు సక్సెస్ అవుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎయిర్పోర్టులు, రైల్వే లైన్లు, రహదారులు, ప్రాజెక్టులు ఇలా అన్నీ కొత్తగా పనులు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే ఆమోదం పొందిన ప్రాజెక్టులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక గతంలో మంజూరైన కోటిపల్లి-నర్సాపురం రైల్వే పనులు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది. ఈ రైల్వే లైన్ పనులు తాజాగా గాడిలో పడ్డాయి. భూ సేకరణ పూర్తైన ప్రాంతాల్లో రైల్వే లైన్ నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ పనులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. అయితే గతంలో ఈ కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్లో భాగంగా భూ సేకరణ పూర్తి చేసిన ప్రాంతాల్లోని భూమిని స్వాధీన పరుచుకుని రైల్వే అధికారులు.. రైల్వే లైన్ నిర్మాణ పనులను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టారు.
ఇక జిల్లాలోని అయినవిల్లి మండలంలోని శానపల్లి లంక, సిరిపల్లి, మాగం.. అమలాపురం రూరల్ మండలంలోని ఏ వేమవరం, బట్నవిల్లి గ్రామాల్లో రైల్వే లైనుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. ప్రతీ గ్రామానికి ఒక ప్రత్యేక బృందాన్ని రైల్వే అధికారులు పంపించి.. రైల్వే లైన్ నిర్మాణ పనులను మొదలుపెట్టారు. ఇక స్థానిక రెవెన్యూ అధికారులు.. ఆయా గ్రామాలలో భూ సేకరణ పూర్తి అయిన భూములను సర్వే చేసి.. వాటికి హద్దులను గుర్తించి రైల్వే అధికారులకు అప్పగించే పనిలో నిమగ్నం అయ్యారు. మరోవైపు.. రైల్వే లైన్ ప్రతిపాదిత ప్రాంతాల్లోని రైతులు.. ఇప్పుడు మరో పంట వేసేలోపు భూ సేకరణ పూర్తైన భూములను తమ ఆధీనంలోకి తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించాలని రైల్వే అధికారులు ఆదేశాలు ఇచ్చారు.