ఉంగుటూరు శాననసభ్యులు పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి
65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు,
ఏలూరు/భీమడోలు: భీమడోలు లొ రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ పునః ప్రారంభ కార్యక్రమంలో ఉంగుటూరు శాననసభ్యులు పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. రేషన్ షాపులో బియ్యం ,పంచదార పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, దివ్యాంగుల వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆప్కాబ్ చైర్మన్, ఏలూరు డిసిసిబి చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే సదుద్దేశంతో ఎండీయూ వాహనాలు రద్దు చేసిందని ప్రతి నెల ఒకటో తేదీ నుండి 15 వ తేదీ వరకూ రేషన్ సరుకులనుపాత పద్దతిలోనే డీలర్లు లబ్ధిదారులకు దుకాణాల వద్ద పంపిణీ చేస్తారని తెలిపారు.వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకుల సరఫరా జరుగుతుందన్నారు.ఎండీయూ వాహనాల ఎప్పడు వస్తాయో తెలియని పరిస్థితిలో కూలీ పనులు చేసుకునే వారు పని మానేసి వాటి కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని చెప్పారు.దుకాణాల వద్ద రేషన్ సరుకులు ఇవ్వడం వల్ల వారు పదిహేను రోజుల్లో ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు
జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 1123 రేషన్ దుకాణాల ద్వారా 6,20,146 రైస్ కార్డుదారులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8.00 గంటల నుంచి మ.12 గం.వరకు,తిరిగి సా.4.00 నుంచి రా.8.00 గంటల వరకు తమకు దగ్గరలో ఉన్న రేషన్ షాపు నుంచి రేషన్ తీసుకోవచ్చన్నారు. అలాగే 65 సంవత్సరాలు పైబడిన కార్డుదారులకు, దివ్యాంగులకు ప్రతినెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మ.12 గంటల నుంచి సా.4 గం.వరకు సంబంధిత రేషన్ డీలర్ల ద్వారా కార్డుదారుల ఇంటి వద్దకే రేషన్ అందించబడుతుందన్నారు. కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో లబ్ధిదారులతో వాట్స్అప్ గ్రూపు క్రియేట్ చేసి రేషన్ పంపిణీ సమాచార ఇవ్వాల్సిందిగా డీలర్లను ఆదేశించారు.
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ రైస్ కార్డుదారులకు ఏటువంటి ఆసౌకర్యం లేకుండా రేషన్ అందించాలనే ఉద్దేశంతో రేషన్ దుకాణాలు వద్దే రేషన్ అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేయడానికోసం తీసుకువచ్చిన ఎం డి యు వాహనాల పథకం సరైన రీతిలో పనిచేయలేదన్నారు.
వాహనాలు నెలలో కొద్దిరోజులే తిరిగేవని, ఒకే చోట నిలిపి సరుకులు ఇచ్చారన్నారు. దీనివల్ల వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో ఉన్నవారికి చాలా ఇబ్బంది అయ్యిందన్నారు. ఈ పరిస్థితిని పరిశీలించిన కూటమి ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం మళ్లీ పాత విధానాన్ని తిరిగి ప్రారంభించిందని చెప్పారు. ఇప్పుడు ప్రతి కుటుంబం ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 వ తేదివరకు తమకు దగ్గరలో ఉన్న రేషన్ షాపు నుంచి రేషన్ తీసుకోవచ్చనన్నారు.
65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంట్లోనే రేషన్ సరుకులు పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని పేర్కొన్నారు. రేషన్ షాపుల్లో రాబోయే రోజుల్లో ఇతర నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులోకి తీసుకురానున్నాయని తెలిపారు. దీనివల్ల డీలర్ల ఆదాయం పెరిగి వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన వివరించారు. ఎండియు వాహనాలపై ఉన్న లోన్లు ప్రభుత్వమే చెల్లించి, ఆ వాహనాలను లబ్దిదారులకు ఇస్తున్నారన్నారు. వాళ్లు వాటిని తమ ఉపాధి కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ మార్పులు ప్రజలకోసం, వారి సౌకర్యం కోసమే అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి. శివరామమూర్తి, తాసిల్దార్ రమాదేవి, మండల మరియు గ్రామ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.