ANDRAPRADESH, PASCHIMA VAHINI: ఆంధ్ర ప్రదేశ్ లోని జర్నలిస్టులకు ప్రభుత్వం తీపికబురు ప్రకటించింది. అక్రిడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పత్రికా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ, మీడియా ప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని హిమాన్షు శుక్ల తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఉన్న అక్రిడేషన్ కార్డుల గడువు ముగియనుండటంతో.. వాటి గడువును జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు.. లేదా కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభం అయ్యే వరకు - ఏది ముందుగా జరిగితే అప్పటి వరకు పొడిగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు.
మీడియా హక్కులను రక్షిస్తూ, వారికి మద్దతుగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించారు. ఇక కొత్త అక్రిడేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభించనుండగా.. సంబంధిత మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియలో అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.