INDIA NEWS: అన్నా చెల్లెలు అంటే వారే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా సోదర ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా కూడా ఉంటున్నారు. ఈ విషయంలో సోనియా గాంధీ చాలా లక్కీ అన్న వారూ ఉన్నారు. నిజానికి చూస్తే వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు గాంధీ కుటుంబం. అ ఆ కుటుంబంలో చూసుకుంటే తొలి తరంలో పండిట్ నెహ్రూ నాయకత్వ పగ్గాలు స్వీకరించారు. ఆయన తరువాత శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు.
ఆ తర్వాత వరసలో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఇక అదే తీసుకుంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. కానీ ఒక జీవిత కాలం లేటు అన్నట్లుగా రాహుల్ కి ప్రధాని పదవి అందని పండు అవుతోంది. మరో వైపు చూస్తే రాహుల్ గాంధీకి ఒక చెల్లెలు ప్రియాంక ఉన్నారు. ఆమె కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.
పార్టీ మీద రాహుల్ కి ఎంత హక్కులు ఉన్నాయో తనకూ ఉన్నాయని ఆమె క్లెయిం చేయవచ్చు. కానీ ఆమె 2004 నుంచి పార్టీ ప్రచారానికే పరిమితం అయ్యారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 2024లో వయనాడ్ లో లోక్ సభకు ఉప ఎన్నిక జరిగితే గెలిచారు. అది కూడా అన్న వదిలేసిన సీటుని. ఆ విధంగా చూస్తే ప్రియాంకను ఎంతగానో మెచ్చుకోవాలి.
ఆమె అమ్మను అన్నను గెలిపించడం కోసమే గత రెండు దశాబ్దాలుగా తన రాజకీయాన్ని అంకితం చేశారు. నిజం చెప్పాలీ అంటే కీర్తి కాంత కనకం అని అంటారు ఎవరికి ఈ మూడింటి మీద వ్యామోహం ఉండదు, పైగా ప్రియాంక తన మామ్మ ఇందిరమ్మ పోలికలతో ఉంటారు, మంచి వాక్చాతుర్యం ఆమె సొంతం. ఆమె అన్ని అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉంటారు. ఎంత కష్టమైనా ఓర్చి ప్రజలకు సేవ చేయాలన్న తపన కూడా ఉంది.
మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా ఆమె ఏనాడు అధికారాన్ని కోరుకోలేదు. అంతదాకా ఎందుకు 2004 నుంచి 2014 దాకా యూపీఅ వన్ టూ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలలో రాహుల్ గాంధీ కనీసం మంత్రి కూడా కాలేదు, ఇక ప్రియాంక నాడే పేచీ పెడితే ఎంపీ అవడం కేంద్ర మంత్రి కావడం కష్టమేమీ కాదు. కానీ ఆమె అధికారానికి ఆవల నిలిచి ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలలో ప్రచారం చేయడం గాంధీ వంశీకులకు పదవులు కాదు ప్రజల శ్రేయస్సు ముఖ్యమని చాటి చెప్పడమే లక్ష్యంగా అన్నా చెల్లెలు పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించి దేశం నలుగు చెరగులూ తిరిగారు. పాదయాత్ర చేసి తన నాయకత్వ పటిమను చాటారు. ఇక ప్రియాంకా గాంధీ చూస్తే కనుక ఉత్తర ప్రదేశ్ లో మహిళా సాధికారికత కోసం పనిచేస్తూ వస్తున్నారు.
రాహుల్ గాంధీ తన చెల్లెలుకి ఎంపీ పదవి ఇచ్చేందుకు ఎంతో ఆప్యాయత చూపిస్తేనే ఆమె అందుకున్నారు. అలాగే అన్న రాహుల్ మేలునే ఆమె సదా కోరుకుంటున్నారు. ఇలా ఇద్దరూ పార్లమెంట్ లో ఎంపీలుగా ఉన్నారు. రాహుల్ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా తనకు మరే పదవీ ఆమె అడగలేదు.
ఇలా జాతీయ రాజకీయాల్లో ఈ అన్నా చెల్లెలు మధ్య ఉన్న అనుబంధం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎక్కడ బంధం అయినా డబ్బు అధికారం వద్ద బీటలు వారుతుంది. కానీ రాహుల్ ప్రియాంక దానికి అతీతం అని నిరూపించారు అంటున్నారు ఒకరి మేలు మరొకరు కోరుకుంటూ ఆదర్శమైన బంధాన్ని కొనసాగిస్తున్నారు.
తెలుగు నాట చూస్తే వైఎస్సార్ ముద్దుల తనయ షర్మిల అన్న జగన్ నే 2024లో ఓడించడానికి తన సర్వ శక్తులూ ఉపయోగించారు. ఆమె ఈ రోజుకీ కాంగ్రెస్ తరఫున ఉంటూనే జగన్ రాజకీయ వినాశనాన్ని కోరుకుంటున్నారు. తనకు ఆస్తులతో పాటు రాజకీయ వాటా కావాలని పట్టుబడుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే జగన్ వైపు నుంచి చూసినా చెల్లెలుని ఎంత వరకూ సమాదరించారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
ఇక తెలంగాణాలో చూసుకుంటే బీఆర్ఎస్ మహిళా నేత కవిత తన సొంత అన్న కేటీఆర్ మీదనే బాణాలు ఎక్కు పెడుతున్నారు. ఇది కేసీఅర్ కి ఇబ్బందికరంగా ఉంది. ఒక వైపు కూతురు మరో వైపు కొడుకు. ఎవరూ తగ్గకుండా లాగితే పెద్దలకు కష్టమే అని అంటున్నారు. ఇవన్నీ కూడా అధికారం రాజకీయ ఆధిపత్యం కోసం వస్తున్న విభేదాలు అని అంటున్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా కళ్ళ ముందే కనిపిస్తున్న రాహుల్ ప్రియాంకలను చూసి అయ్నా తెలుగు నాట అన్నా చెల్లెళ్ళు విభేదాలు మాని సామరస్యంగా ముందుకు అడుగులు వేస్తే మంచిదన్న సూచనలు వస్తున్నాయి.