ఏపీలో ఎన్నో కులాలు ఉన్నాయి. రాజకీయంగా దశాబ్దాలుగా శాసిస్తున్న కులాలుగా రెడ్డి, కమ్మ ఉంటే కాపులు రాజకీయ వాటా కోరుతున్నారు. బీసీలు మొత్తం జనాభాలో అరవై శాతం ఉంటారని అనుకున్నా అందులో ఎన్నో కులాలు ఉండడంతో ఐక్యత ఎండమావిగా మారుతోంది.
ప్రస్తుతానికి చూస్తే ప్రధాన కులాలలో కమ్మలు, రెడ్ల మధ్య అధికారం వరసగా అటూ ఇటూ మారుతూ వస్తోంది. ఇక తెలుగుదేశం ఆవిర్భావం వెనక కూడా కమ్మ కులం నుంచి రేగిన అసంతృప్తి ఉందని అంటారు. దాన్ని సరైన టైం లో ఎన్టీయార్ ని ప్రవేశపెట్టి సొమ్ము చేసుకున్నారు అని అంటారు.
అనంతర కాలంలో కాపులు కూడా రాజకీయాల్లో తమ వాటా కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అది వంగవీటి రంగా నుంచి మొదలై మధ్యలో ముద్రగడ పద్మనాభంతో కొనసాగి, ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా కొంత ముందుకు కదిలి మళ్ళి నిలిచిపోయింది. ఇపుడు జనసేన రూపంలో కొంత ప్రయత్నం సాగుతోంది.
ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరికి లాభం, ఏ పార్టీకి అధికారం అన్న చర్చ అయితే ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ పొత్తు వల్ల ఒరిగేది లేదు అనే వాళ్ళు ఉన్నారు. లేదు వైసీపీకి గట్టి షాక్ అని చెప్పేవారూ ఉన్నారు. కానీ తలపండిన రాజకీయ నాయకులు మాత్రం పొత్తు బెడిసికొడుతుంది అనే అంటున్నారు.
ఎన్టీయార్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి నీతిగా నిజాయతీగా చాన్నాళ్ళు రాజకీయం చేసిన అడుసుమల్లి జయప్రకాష్ కుండబద్ధలు కొట్టడంలో నిపుణులు. ఆయన సూటిగా సుత్తి లేకుండానే ఏ విషయం అయినా చెబుతారు. జనసేన టీడీపీ పొత్తు మీద ఒక యూట్యూబ్ చానల్ తో ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి.
జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నది నిజం. ఇపుడు అదే జరుగుతోంది. టీడీపీ జనసేనకు సొంత బలం తగ్గిపోయింది. అటు పవన్ ఇటు చంద్రబాబు పరస్పర ఆధారితాలుగా మారారు. టీడీపీని చంద్రబాబు లోకేష్ ఇద్దరూ నడపలేని స్థితికి వచ్చేశారు. ఇక జనసేన నేత పవన్ కి రాజకీయ నిలకడ లేదు. ఆయన పార్టీకి సంస్థాగత పునాది లేదు.
అందువల్లనే రెండు పార్టీలు కలసి ముందుకు సాగుతున్నాయని విశ్లేషించారు. అయితే ఈ కూటమి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న ప్రశ్న క్యాడర్ వేయకుండా ఓటు వేస్తుందని అనుకుంటే పొరపాటు అని అడుసుమల్లి చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎం కావాలని కమ్మ వర్గంతో పాటు టీడీపీ మొత్తం పార్టీ బలంగా కోరుకుంటుంది. అలాగ పవన్ సీఎం కావాలని కాపులు కోరుకుంటారు. జనసేన క్యాడర్ అదే కోరుకుంటుంది.
మరి ఇక్కడే వివాదం స్టార్ట్ అవుతుంది. పొత్తు బెడిసికొడుతుంది అని ఆయన అంటున్నారు. అంతే కాదు కమ్మ కాపుల మధ్య సామాజికపరంగా కూడా కలిసేందుకు కొంత ఇబ్బంది ఉందని అన్నారు. గోదావరి జిల్లాలలో ఎంతో కొంత ఫలిస్తే ఫలించవచ్చు కానీ ఏపీ మొత్తం ఈ పొత్తు ఫలితాన్ని ఇవ్వద్దు. మరోమారు వైసీపీ అధికారంలోకి రావడానికే ఈ పొత్తు ఉపయోగపడుతుంది అని ఆయన అంటున్నారు.
పై స్థాయిలో నేతలు అంతా బాగుంది అనుకుంటే సరిపోదని దిగువ స్థాయిలో కూడా పొత్తు కుదరాలని ఆయన అంటున్నారు. అది మాత్రం ఎక్కడా కనిపించడంలేదని అడుసుమల్లి చెప్పుకొచ్చారు. పైగా కాపుల చిరకాల వాంచ అయిన సీఎం పదవిని జనసేనానికి ఇవ్వకపోతే వారు రివర్స్ అవుతారని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇక చంద్రబాబుని సీఎం చేయకపోతే పొత్తులు ఎందుకు అని ఆ పార్టీ సహా కమ్మవారు భావిస్తారు అని అన్నారు.
దీంతో ఎటూ కుదరని అయోమయంగా మారి పొత్తులు పెటాకులు అవడం ఖాయమని అన్నారు. వైసీపీ సైతం వ్యూహాత్మకంగానే ఈ పొత్తులను గమనిస్తూ కొత్త ఎత్తులతో ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. వైసీపీకి సీఎం జగన్ ఉన్నారు. కూటమిలో గందరగోళం ఉంది. అదే వైసీపీకి అది పెద్ద అడ్వాంటేజ్ అని ఆయన అంటున్నారు. ఇద్దరూ ఒకే సీటు కోసం ఆశలు పెంచుకుని కలసినట్లుగా వస్తే జనాలు నమ్ముతారన్నది భ్రమ మాత్రమే అని అడుసుమల్లి జయప్రకాష్ స్పష్టం చేశారు.