పశ్చిమ వాహిని | సెప్టెంబర్ 01, 2026:
ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా డిజిటల్ చెల్లింపులు చేసుకునే సదుపాయాన్ని ఫోన్పే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫీచర్ ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ‘యూపీఐ 123పే’ సేవను ప్రవేశపెట్టింది. సాధారణ 2జీ నెట్వర్క్, ఎస్ఎంఎస్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సేవ గ్రామీణ ప్రాంతాలు, స్మార్ట్ఫోన్ లేదా స్థిరమైన ఇంటర్నెట్ సౌకర్యం లేని వారికి ఉపయోగపడనుంది.
ఈ సేవ ద్వారా మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీతో డబ్బులు పంపడం, బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, గత లావాదేవీలను పరిశీలించడం వంటి సదుపాయాలు లభిస్తాయి. కెమెరా ఉన్న ఫీచర్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో మొబైల్ రీఛార్జ్, విద్యుత్ బిల్లుల చెల్లింపులు వంటి మరిన్ని సేవలను జోడించనున్నట్లు ఫోన్పే తెలిపింది.
ఫీచర్ ఫోన్ వినియోగాన్ని సులభతరం చేసేందుకు ఫోన్పే ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ను కూడా అందిస్తోంది. తెలుగు సహా 12 భారతీయ భాషల్లో మార్గదర్శకత్వం అందించే ఈ సదుపాయం ముఖ్యంగా వృద్ధులు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన తక్కువగా ఉన్న గ్రామీణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. నోకియా, లావా, ఐటెల్, హెచ్ఎండీ వంటి ఫోన్ తయారీ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ఈ సేవను మరింత మందికి చేరువ చేయాలని సంస్థ భావిస్తోంది.
యూపీఐ 123పేను యాక్టివేట్ చేసుకోవడానికి ఫోన్లో సేవను ఓపెన్ చేసి, బ్యాంకును ఎంచుకుని డెబిట్ కార్డు వివరాలతో యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. అనంతరం ‘పే టు మొబైల్’ లేదా ‘పే టు యూపీఐ ఐడీ’ ఎంపిక చేసుకుని మొత్తం, పిన్ నమోదు చేస్తే చెల్లింపు పూర్తవుతుంది. ఇంటర్నెట్పై ఆధారపడకుండా డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఫోన్పే యూపీఐ 123పే డిజిటల్ చెల్లింపుల పరిధిని మరింత విస్తరించే అవకాశముంది.



