ద్వారకాతిరుమలలో ప్రజలతో పెద్దఎత్తున ప్రజలతో ఏర్పాటుచేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి,, జేసీ పి . ధాత్రిరెడ్డి
ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతగానో దోహదపడుతుంది
ANDRAPRADESH, ఏలూరు/ద్వారకా తిరుమల: ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ద్వారకా తిరుమలలోని హరిత హోటల్ వద్ద జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఆర్డీఓ రమణ, ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరూ ఒత్తిడితో కూడిన జీవనం గడుపుతున్నారని, యోగా ద్వారా మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుందని, యోగా ను ప్రతీ ఒక్కరు వారి జీవనశైలి భాగంగా చేసుకోవాలన్నారు. జూన్, 21 వతేదీన ప్రపంచ యోగ దినోత్సవాన్ని మన రాష్ట్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించడం మనకు ఎంతో గర్వకారణమన్నారు. జిల్లాలో వెయ్యి మందికి పైగా యోగా ట్రైనర్లను గుర్తించామని, వారితో జిల్లా వ్యాప్తంగా మే, 21 వ తేదీ నుండి జూన్, 21 వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాంతాలలోని ప్రజలతో యోగాభ్యాసన చేయించడంతోపాటు, యోగా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
యోగాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలలో 4 రోజులు పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలతో యోగాభ్యాసన చేయిస్తున్నామన్నారు. గ్రామ, మండల, జిల్లాస్ధాయిలో యోగాంధ్ర పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ, వార్డుస్ధాయిలో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు మండల స్ధాయిలో జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు, జిల్లాస్ధాయిలో జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే జూన్ 16 నుంచి 18 వరకు రాష్ట్రస్ధాయిలో పోటీలు ఉంటాయన్నారు.
ఈ పోటీల్లో పాల్గొనేందుకు స్ధానిక సచివాలయాల్లో సంప్రదించి సంబంధిత యోగా పోటీల్లో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యోగా యాప్ లో ప్రతీ ఒక్కరు రిజిస్టర్ కావాలని, జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో 8 లక్షల రిజిస్ట్రేషన్లు లక్ష్యం కాగా ఇప్పటివరకు లక్షా 40 వేల మంది నమోదు చేసుకున్నారన్నారు. యోగా కార్యక్రమం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ ఒక్కరూ యోగాభ్యాసం చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. మాలిని, పర్యాటక అభివృద్ధి అధికారి పట్టాభిరామయ్య, తహసీల్దార్ సుబ్బారావు, ఎంపిడిఓ ప్రకాష్, యోగా శిక్షకులు జి.విజయలక్ష్మి, సిహెచ్. శివ, కె. వినోద్ కుమార్, ప్రభృతులు పాల్గొన్నారు.