Hot Posts

6/recent/ticker-posts

ఉద్రిక్తతలు తక్షణమే తగ్గించండి.. భారత్, పాక్‌లకు అమెరికా విజ్ఞప్తి.. జైశంకర్‌, షహబాజ్‌కు ఫోన్


INDIA NEWS: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో అమెరికా సెక్రటరీ మార్కో రూబియో ఫోన్‌లో మాట్లాడారు. అదే సమయంలో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు కూడా మార్కో రుబియో ఫోన్ చేశారు. తక్షణమే రెండు దేశాలు ఉద్రిక్తతలను ఆపేయాలని హితవు పలికారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు అమెరికా మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.


అదే సమయంలో ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా అన్ని రకాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ కాల్స్‌కు సంబంధించిన వివరాలను యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ బ్రూస్ గురువారం రాత్రి తెలిపారు. మరోవైపు.. పహల్గామ్‌ ఉగ్రదాడికి మార్కో రూబియో సంతాపం తెలిపారు.

గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వైమానిక దాడికి సంబంధించిన సైరన్‌లు మోగాయి. ఈ క్రమంలోనే సైన్యం చాలా ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్‌లు విధించింది. జమ్మూ ఎయిర్‌పోర్ట్ సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను భారత్ వైమానిక రక్షణ యూనిట్లు అడ్డుకుని కూల్చి వేశాయి. అదే సమయంలో పాకిస్తా్న్‌కు సంబంధించిన ఒక ఎఫ్-16 యుద్ధ విమానంతోపాటు రెండు జేఎఫ్-17 ఫైటర్ జెట్లను భారత రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ మీడియా ముందు ఒప్పుకోవడం గమనార్హం.