గుంటూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు మరోసారి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు గుంటూరు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండగ వేళ.. సత్తెనపల్లిలో లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు కొనుగోలు చేసేలా వ్యవహరించిన కేసులో అంబటి రాంబాబుకు న్యాయమూర్తి ఈ రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు అంబటి రాంబాబును భారీ బందోబస్తు నడుమ తరలించారు.
సంక్రాంతి పండగ వేళ సత్తెనపల్లిలో లక్కీ డ్రా పేరుతో టికెట్లు విక్రయించారు. వీటిని ప్రజలకు వైసీపీ నేత అంబటి రాంబాబు బలవంతంగా విక్రయించేలా చర్యలు చేపట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనపై జనసేన పార్టీకి చెందిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అంబటిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అంబటిపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు అంబటిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. తాజాగా లక్కీ డ్రా కేసులో ఈ రోజు గుంటూరు కోర్టులో అంబటిని సత్తెనపల్లి పోలీసులు హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దాంతో గుంటూరు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు ఆయన్ని తరలించారు.







